Monday, November 27, 2023

రమణ మహర్షి విశేషాలు

 *రమణ మహర్షి విశేషాలు*


1) రమణ మహర్షి ప్రత్యక్ష సుబ్రహ్మణ్య స్వామి అవతారం
2) వారు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అరుణాచలం వెళ్ళారు.
3) వారు శరీరం విడిచి పెట్టే వరకు అరుణాచలం విడిచిపెట్టలేదు.
4) వారు శరీరాన్ని విడిచిపెట్టిన సమయంలో, 5 జ్యోతులు ఆకాశంలోకి వెళ్లి అరుణాచల పర్వతంలో కలిసిపోయాయి
5) వారు చాలా సంవత్సరాలు ఏమీ తినకుండా, నీరు కూడా తాగకుండా తపస్సు చేశారు
6) వారు కుక్కలు / కోతులు / నెమళ్ళు / పులులు / ఆవులు / ఏనుగులు మొదలైన వాటితో మాట్లాడేవారు.
7) ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో వారు తెలుసుకోగలరు
8) వారి సమక్షంలో, జంతువులన్నీ తమలోని నిజమైన శత్రు భావనను మరచిపోయి స్నేహంగా ఉండేవి.
9) వారు తన తల్లికి ముక్తిని ఇచ్చారు- కొన్ని కోట్ల జన్మల కర్మలను కొన్ని గంటలలో సూక్ష్మ శరీరముతో అనుభవింప చేసారు
10) మహర్షి చాలా సాదా సీదా జీవితాన్ని గడిపేవారు
11) మహర్షి ప్రతి వారం అరుణాచల పర్వతం గిరి ప్రదక్షిణ 2/3 రోజులు చేసేవారు.
12) వారు చాలా సంవత్సరాలు ఎవరితోనూ మాట్లాడలేదు
13) వారిని మౌన స్వామి అనే పేరుతో పిలిచే వారు
14) తరువాత కావ్యకంఠ గణపతి మునితో మొట్టమొదటి సారిగా మాట్లాడారు.
15) కావ్యకంఠ గణపతి ముని వారికి - భగవాన్ శ్రీరమణ మహర్షి అనే పేరు పెట్టారు.
16) మహర్షి ఉపదేశ సారము & అరుణాచల అక్షర మణిమాల అని పిలువబడే 2 ప్రసిద్ధ రచనలను లోకానికి ఇచ్చారు
17) చాలా మంది సిద్ధ పురుషులు - జంతువుల రూపంలో మహర్షిని సేవించేవారు
18) మహర్షి ఆ యొక్క సిద్ధ పురుషులు శరీరము విడిచి పెట్టిన తర్వాత - వారందరికిీ భూమిలో దహన సంస్కారాలు చేశారు
19) ఇప్పటికీ వారి సమాధులను మనం రమణ మహర్షి ఆశ్రమంలో చూడవచ్చు
20) మహర్షి తనను చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరి మనస్సులను చదవగలరు
21) దేశవిదేశాల నుండి భక్తులు మహర్షిని కలవడానికి వచ్చేవారు
22) మహర్షి తన చుట్టుూ ఉండే జంతువులకు జీడిపప్పు/బాదం పెట్టే వారు
23) మహర్షి కేవలం గోచీ మాత్రమే ధరించేవారు

Friday, November 24, 2023

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం స్థలపురాణము

 స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం స్థలపురాణము


కలియుగమున భూలోకము నందు దేశ క్షేమము కొరకు, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేయుటకు, భక్తుల మనోభీష్టములు నెరవేర్చుటకు శ్రీ వినాయక స్వామి వారు సంకల్పించుకొనిరి.
ఆసమయమున అనగా సుమారు 1000 సంవత్సరముల పూర్వం బాహుదా నదీ తీరమున విహారపురిగా పిలవబడే ఈ ప్రాంతము నందు దైవ భక్తి పారాయణులు అయిన ముగ్గురు అవిటి సోదరులు (మూగ, చెవిటి, గ్రుడ్డి) తనముతో బాధపడుచూ వారికి గల కొంత వ్యవసాయ భూమి పైన ఆధారపడి జీవనము సాగిస్తూ నిత్యం భగవద్ధ్యానములో నిమగ్నమైయుండేవారు.
ఈ ప్రాంతం ప్రజలు కరువుతో పంటలు పండక ఆకలి దప్పికలతో బాధపడుచున్న సందర్భమున, ప్రజాక్షేమము కోరి అవిటి సోదరులైన ఆ ముగ్గురు ఒక శుభ దినమున సకల విఘ్నహరుడు, కోరిన కోర్కెలు తీర్చు గణపతిని ముందుగా పూజించి వారి వ్యవసాయ భూమి యందు బావిని త్రవ్వుట ప్రారంభించిరి. అప్పుడు త్రిలోక పూజ్యుడైన మహాగణపతి ఆ ప్రాంతం ప్రజలను అనుగ్రహించుటకు నిర్ణయించుకొని సాక్షాత్తు కైలాసము నుండి దిగి వచ్చి తవ్వుచున్న బావి నందు రాతి రూపమును దాల్చి ఆసీనులై ఉండిరి.
ఆ ముగ్గురు సోదరులు సదరు రాయిని పగుల గొట్టుటకు గడ్డపారతో బలంగా కొట్టగా, గడ్డపార తగిలిన వెంటనే ఆ రాయి నుండి తీవ్ర రక్తస్రావం జరిగినది. స్వామి రక్త స్పర్శ మాత్రంతోనే వారి అవిటితనం తొలగిపోయినది. వెంటనే ఇక్కడ ఏదో దైవశక్తి ఉన్నదని గ్రహించి చుట్టూ త్రవ్వి చూశారు. అప్పుడు అక్కడ మహా గణపతి విగ్రహం వారికి సాక్షాత్కరించింది. ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామస్థులు వచ్చి బావిలోని శ్రీ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టగా వచ్చిన కొబ్బరి నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరం పాతిక భూమి ప్రవహించినది.
"కాణి" అనగా ఎకరం పాతిక భూమి "పారకం" అనగా ప్రవహించడం. ఎకరం పాతిక భూమి వరకు నీరు ప్రవహించినందున “కాణిపారకం” క్రమేపీ “కాణిపాకం" గా మారినది. శ్రీ స్వామివారు అనుగ్రహించుట వలన ఇక్కడ మంచి వర్షాలు పడి, ఈ ప్రాంతము సుభిక్షంగా మారినది.
ఆ తరువాత మంచి పంటలు పండి ప్రజలు అంతా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉన్నారు. అందుచేత ఇక్కడ కోరిన వరములు వెంటనే తీర్చుట వలన స్వామివారికి "వరసిద్ధి వినాయకుడు" అని పేరు వచ్చియున్నది. అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతమును పరిపాలించు మహారాజులు అందరూ కలిసి దేవాలయ నిర్మాణము చేసి ప్రతినిత్యం శ్రీ స్వామి వారికి,  శైవాగమోక్తముగా పూజాదికములు నిర్వహించుచున్నారు. నాటి నుండి నేటి వరకు కూడా శ్రీ స్వామి వారు దిన దినాభివృద్ధిగా పెరుగుతున్నారు.

Friday, October 27, 2023

జీవితం...(కవిత)

 జీవితమనే పుస్తకంలోని ఓ పేజీలో 

అందంగా అక్షరాలు వ్రాసి 

ఎన్నెన్నో రంగులడ్డాను...

ఎక్కడి నుంచో వచ్చిన ఓ కన్నీటి బొట్టు

అక్షరాలను చెరిపేసింది

చెదరిన వాక్యాలు మసగబారిన కలలు కాగా

కలిసిన రంగులు చీకటిగా కనిపించాయి...

అయినా 

పుస్తకం నా బుజం తట్టింది..

కలం పట్టి మరో  పేజీ తిప్పాను..

Sunday, August 12, 2018

ఉత్తములు - మధ్యములు - అధములు : లక్షణాలు



ఆలోచనల, ప్రవర్తనా ధోరణి బట్టి మన సమాజంలో మూడు రకాల మనుషులు ఉన్నారు. వారు అధములు, మధ్యములు, ఉత్తములు.

అధములు:


  • తమంతట తామే వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.  అయితే వాటిని స్థిరంగా తీసుకోలేరు.
  • మిత్రులను తరచూ మారుస్తుంటారు. అందుకే వీరికి మిత్రులూ తక్కువే
  • వీరు సంబంధాలను నిలకడగా ఉంచుకోరు.
  • వీరి ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు.
  • డబ్బు విలువ తెలీదు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. అప్పులు కూడా ఎక్కువ.
  • చదువు విలువ తెలీదు.
  • సమయపాలన ఉండదు. ఏ పనీ టైంకు చేయరు.
  • వీరు ఎవర్నీ నమ్మరు. నమ్మినట్లు నటిస్తారు అంతే.
  • వీరికి నీతి వాక్యాలు  రుచించవు. తనకు ఎవరైనా మంచి చెపితే వారిపైనే విరుచుకు పడతారు.
  • వీరు అనుక్షణం ఎదుటివారిలో తప్పులు వెతుకుతుంటారు.
  • దేవుడిని నమ్మరు. తన తర్వాతే దేవుడు అనుకుంటారు.
  • తమకు జరుగుతున్న కష్టాలకు ఎదుటివారిని, దేవుడిని నిందిస్తారు.
  • బద్ధకం ఎక్కువ. ఎక్కువ నిద్రపోతూ ఉంటారు.
  • వీరు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. 
  • పొగడ్తలకు దాసోహం అవుతారు. పొగడ్తలతో వీరిని లొంగదీసుకోవచ్చు.
  • అంతేకాదు, వీరికి భయంకూడా ఎక్కువే. ప్రతీదానికీ విపరీతంగా భయపదిపోతూ ఉంటారు.
  • వీరికి “తాను” అనే స్వార్ధం ఎక్కువ. తన గురించి మాత్రమె ఆలోచిస్తారు.


మధ్యములు:


  • వీరు నిర్ణయాలు స్వంతంగా తీసుకోలేరు. ఎదుటివారిపై ఆధారపడతారు.
  • వీరికి స్నేహితులు ఎక్కువ. అన్నిరకాల స్నేహితులూ ఉంటారు.
  • సంబంధాలను తెంచుకోకూడదు అనుకుంటారు. కానీ సాధ్యం కాదు.  
  • అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంటారు. అయితే వారిలో ఏదైనా లోపం కనిపిస్తే ఇక మళ్ళీ వారి ముఖం చూడరు.
  • డబ్బు సంపాదించడమే గొప్ప అనుకుతారు. ఏంతొ సంపాదించినా  అది ఖర్చు పెట్టలేరు. పిసినారిగా ఉంటారు.
  • వీరు ఒకర్ని నమ్మితే వారితోనే ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటారు. మిగతావారి మాటలను లెక్క చేయరు.  
  • తాను నమ్మిన దేవుడు అంటే నమ్మకం ఎక్కువ. అయితే వేరే దేవుళ్ళను విమర్శిస్తూ ఉంటారు.
  • కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోయి దేవుడిపై భారం వేస్తారు.
  • ఎదుటివారు తప్పులు చేసినప్పుడు మొగమాటం వల్ల చెప్పలేరు.
  • పొగడ్తలు అంటే వీరికి పడదు.
  • భయం కలిగినప్పుడు వేరొకరి సహాయం తీసుకుని బయటపడడానికి చూస్తారు.
  • సమయం విలువ తెలిసినా పాటించలేకపోతారు.
  • వీరికి తన కుటుంబం అనే స్వార్ధం ఎక్కువ. తానూ,తన కుటుంబం బాగుంటే చాలు. ప్రపంచం గురించి అవసరం లేదు.


ఉత్తములు :


  • అన్ని విధాల ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉన్నా లెక్కచేయరు.
  • తన ఆలోచనలకు సరితూగే స్నేహితులను మాత్రమె ఎంచుకుంటారు. వీరికి స్నేహితులు తక్కువ.
  • మానవ సంబంధాలపై గౌరవం ఎక్కువ. సంబంధాలను తెంచుకోవాలనుకోరు.
  • ఎదుటివారిలో మంచిని చూస్తారు. వారు ఏదైనా తప్పులు చేస్తే చెప్పడానికి వెనుకాడరు. అలాగే మంచిపని  చేస్తే పొగడడానికీ వెనుకాడరు.
  • డబ్బు విలువ తెలుసు. ఎప్పుడు ఖర్చు పెట్టాలో అప్పుడు ఖర్చుపెడతారు.
  • అందరినీ సమదృష్టితో చూస్తారు.   
  • దేవుడు ఒక్కడే అని అందరు దేవుళ్ళూ సమానమే అని నమ్ముతారు.
  • కష్టాలు వచ్చినప్పుడు సహనంతో ఉంటారు. వాటి నుంచి భయపడడానికి అన్ని మార్గాలనూ వెతుకుతుంటారు.
  • ఎదుటివారి కష్టాలలో సాయపడుతూ ఉంటారు.
  • ఖచ్చితమైన సమయపాలన పాటిస్తారు. ప్రతీపనీ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
  • వీరు అంతః సౌందర్యానికి విలువ ఇస్తారు. 
  • ధైర్యంగా ఉంటారు. అంతేకాదు ఎదుటివారికీ ధైర్యాన్ని ఇస్తారు.
  • ఎవరైనా పొగిడితే ఎలా తీసుకుంటారో, తిట్టినా అలాగే తీసుకుంటారు.
  • వీరికి సమాజంపై బాధ్యత ఎక్కువ. వీరు తనతోపాటూ సమాజం కూడా బాగుపడాలి అనుకుంటారు.


భగవద్గీతలో భగవానుడు చెప్పిన శ్లోకం

య‌ద్య‌దాచ‌ర‌తి శ్రేష్ఠః త‌త్త‌దేవేత‌రో జ‌నః

స య‌త్ప్ర‌మాణం కురుతే లోక‌స్త‌ద‌నువ‌ర్త‌తే


దీని అర్ధం - ఉత్తములైన వారు దేనిని ఆచ‌రిస్తారో, దానినే ఇత‌రులు కూడా ఆచ‌రిస్తారు.. అలానే ఉత్తములు దేనిని అయితే ప్రమాణముగా అంగీక‌రిస్తారో లోక‌మంతా కూడా దానినే అనుస‌రిస్తుంది అని.

అందుకే మనకు తారసపడే ఉత్తముల లక్షణాలను ఆచరణ చేద్దాం. మనం ఏ కోవకు చెందుతామో విశ్లేషించుకొని ఉత్తమ లక్షణాలను అలవర్చుకోడానికి ప్రయత్నిద్దాం.


Monday, January 6, 2014

మంచి వాక్యాలు - 5

కార్యశూరులు కన్నీరు కారుస్తూ కాలాన్ని వృధా చేయరు. 
ఎంచి చూడగా లోకమందు మంచి చెడ్డలు రెండే కులములు - గురజాడ 
భారత దేశ భవిష్యత్తు తరగతి గది నుండే రూపు దిద్దుకుంటుంది. 
ఎ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని - రాయప్రొలు. 
నిజమైన భారత దేశం గ్రామాల్లోనే ఉంది .  -గాంధీ 
సత్ప్రవర్తన అనేది తనకు తానే ఇచ్చుకొనే బహుమానం - సిసిరో 
 

Friday, January 3, 2014

మంచి వాక్యాలు - 4

తెలివిగలవాడు పుస్తకాల్నే కాక జీవితాన్నీ అధ్యయనం చేస్తాడు.
చెడును సహించినవాడు మంచిని మలినపరిచినట్లే.!
మూఢనమ్మకాలు లేనివారికి మృత్యుభయం లేదు                           - గురునానక్
నిదానంగా వాగ్ధానం చేసేవాడు, దానిని నమ్మకంగా నెరవేరుస్తాడు          - రూసో
చేసినదాన్ని చెప్పడంకంటే, చెప్పినదాన్ని చేయడం చాలా కష్టం           - గోర్కీ
ఒక్క చిన్న సిరాచుక్క కోట్లాది ఆలోచనలకు వేగుచుక్క
వ్యక్తిగా ప్రతీవారినీ గౌరవించు.. కానీ, పూజించకు.

Sunday, December 29, 2013

మంచి వాక్యాలు - 3

శ్రమ శరీరాన్ని పరిపుష్టం చేసినట్లే కష్టాలు బుద్దిని పరిపుష్టం చేస్తాయి.

ధనమే మాట్లాడే చోట సత్యం గొంతు నొక్కివేయబడుతుంది.

పిరికివాడు తన ప్రాణాన్నేకాక ఇతరుల జీవితాన్ని కూడా బలి తీసుకుంటాడు.

దుర్మార్గునికి మేలు చేయడం సన్మార్గునికి హాని చేసినంత ప్రమాదకరం.